Diwali 2024 ఈ ఏడాది దీపావళి పండుగ తేదీకి సంబంధించి కొంత గందరగోళం నెలకొంది. ఎందుకంటే అమావాస్య తిథి అక్టోబర్ 31, నవంబర్ 1న రెండ్రోజుల పాటు వచ్చింది. ఈ సందర్భంగా దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి.. లక్ష్మీ పూజా విధానం, శుభ ముహుర్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

దీపావళి ఎప్పుడంటే..

శాస్త్రాల ప్రకారం, దీపావళి పండుగను కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే ఈసారి అమావాస్య తిథి అక్టోబర్ 31, నవంబర్ 01వ తేదీన రెండురోజుల పాటు వచ్చింది. దీంతో అందరిలోనూ గందరగోళం నెలకొంది. అయితే వేద క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:12 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు సాయంత్రం 5:14 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. వేద పంచాంగం ప్రకారం, దీపావళి రోజున అమావాస్య తిథి ప్రదోష కాల సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి ఈసారి అక్టోబర్ 31వ తేదీన అమావాస్య తిథి, ప్రదోష కాలం, నిశిత ముహుర్తాలలో జరుపుకోవడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
శుభ సమయం..

దీపావళి పూజకు అనుకూల సమయం: 31 అక్టోబర్ 2024 గురువారం సాయంత్రం 6:27 గంటల నుంచి రాత్రి 8:32 గంటల వరకు
దీపావళి పూజ కోసం నిశిత ముహుర్తం : అక్టోబర్ 31న రాత్రి 11:39 గంటల నుంచి అర్ధరాత్రి 12:31 గంటల వరకు
ప్రదోష కాలం : సాయంత్రం 5:35 గంటల నుంచి రాత్రి 8:11 గంటల వరకు
వృషభ రాశి కాలం : సాయంత్రం 6:21 గంటల నుంచి రాత్రి 8:17 గంటల వరకు
దీపావళి క్యాలెండర్ 2024

ధన త్రయోదశి 29 అక్టోబర్ 2024
నరక చతుర్దశి, చోటి దీపావళి 30 అక్టోబర్ 2024
దీపావళి, లక్ష్మీ పూజ 31 అక్టోబర్ 2024
గోవర్దన పూజ 02 నవంబర్ 2024
భాయ్ దూజ్ 03 నవంబర్ 2024
కావాల్సిన పూజా సామాగ్రి..

దీపావళి వేళ లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడానికి ముందుగా కుంకుమ, అక్షింతలు(పసుపు కలిపిన బియ్యం), తమలపాకులు, కొబ్బరి, లవంగాలు, యాలకులు, ధూపం, కర్పూరం, ధూపం, మట్టి దీపాలు, దూది, తేనె, పెరుగు, గంగాజలం, బెల్లం, కొత్తిమీర, పండ్లు, పువ్వులు, బార్లీ, గోధుమలు, గంధం, సింధూరం, పాలు, ఎండు ఖర్జూరాలు, తెల్లని వస్త్రాలు, తామర పువ్వులు, శంఖం, వెండి నాణెం, మామిడాకులు, నైవేద్యాన్నిసిద్ధంగా ఉంచుకోవాలి.
దీపారాధన..

దీపావళి రోజున ఈశాన్యం లేదా ఉత్తర దిక్కున శుభ్రం చేసి స్వస్తిక చిహ్నాన్ని తయారు చేసుకోవాలి. దానిపై అక్షింతలు వేయాలి. ఆ తర్వాత ఎరుపు రంగు వస్త్రంతో చెక్క పీటను ఉంచాలి. దానిపై లక్ష్మీదేవి, వినాయక ఫోటోలు లేదా విగ్రహాన్ని ఉంచాలి. ముందుగా గంగాజలంతో శుద్ధి చేయాలి. వినాయకుడి మంత్రాలతో పూజను ప్రారంభించాలి. లక్ష్మీదేవి గణేశుడిని పూజించిన తర్వాత చివరగా హారతి ఇవ్వాలి. మిఠాయిలను, ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఉదయం, సాయంత్రం మీ ఇంట్లోని ప్రతి మూలలో దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.