Indians in US : భారతీయులను వెనక్కి పంపించేస్తున్న ట్రంప్- బయలుదేరిన తొలి విమానం..

P Madhav Kumar





ట్రంప్​ తన ఇమ్మిగ్రేషన్​ అజెండా కోసం మిలిటరీ సాయం తీసుకుంటున్నారు. అమెరికా- మెక్సికో సరిహద్దులకు అదనపు బలగాలను పంపించారు. ఇమ్మిగ్రెంట్స్​ని డిపోర్ట్​ చేసేందుకు మిలిటరీ విమానాలను వాడుకుంటున్నారు లేదా వారికి ఆశ్రయం కల్పించేందుకు మిలిటరీ స్థావరాలను నిర్మిస్తున్నారు.

అక్రమ వలసదారులతో కూడిన కొన్ని విమానాలు ఇప్పటికే గ్వాటెమాలా, పెరూ, హోండురస్​కు చేరుకున్నాయి. ఇప్పుడు దూరంగా ఉన్న ఇండియాకు కూడా విమానం బయలుదేరింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్​హౌస్​కు తిరిగి వచ్చిన తర్వాత దేశంలో అక్రమంగా నివాసముంటున్న భారతీయులను డిపోర్ట్​ చేయడం ఇదే తొలిసారి.

ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్​తో జరిగిన చర్చల్లో ట్రంప్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. తమ దేశంలోని భారతీయుల అక్రమ వలసలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్మిగ్రేషన్ గురించి ప్రధాని మోడీతో చర్చించానని, అక్రమ వలసదారులను వెనక్కి రప్పించే విషయంలో భారత్ 'సరైన విధంగా' స్పందిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య సహకారాన్ని ఎలా విస్తరించాలో, ఎలా బలోపేతం చేయాలో ఇరువురు నేతలు చర్చించారని వైట్​హౌస్ తెలిపింది.

'అక్రమ వలసలు' అని విదేశాంగ శాఖ పేర్కొన్న అంశాన్ని రుబియో జైశంకర్ వద్ద ప్రస్తావించారు. అమెరికాకు అక్రమ వలసలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని భారత విదేశాంగ మంత్రి హామీనిచ్చారు.

2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు భారత్ నుంచి 1,100 మందికి పైగా అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించింది!

డిపార్ట్​మెంట్​ ఆఫ్ హోమ్​ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) బోర్డర్ అండ్ ఇమ్మిగ్రేషన్ పాలసీ అసిస్టెంట్ సెక్రటరీ రాయిస్ ముర్రే గత నవంబర్​లో మాట్లాడుతూ.. “అక్రమంగా దేశంలో ఉంటున్న భారతీయుల డిపోర్టేషన్​ అనేది గత కొన్నేళ్లుగా స్థిరంగా పెరుగుతూనే ఉంది,” అని అన్నారు.
అమెరికాకు మోదీ..!

ట్రంప్​ టారీఫ్​ భయాలు, అక్రమ వలసదారుల డిపోర్టేషన్​ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాకు వెళ్లనున్నట్టు వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 13న ఆయన ట్రంప్​తో భేటి అవుతారని పలు నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్​ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం మోదీ ఆయన్ని కలవడం ఇదే తొలిసారి అవుతుంది. సుంకాలు, డిపోర్టేషన్​పై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది.

Tags
Chat