తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల (అక్టోబర్ నెల 2025) వివరాలను ప్రకటించింది. ఈనెల 22న ఆర్జిత సేవా టికెట్లు, 24వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన టికెట్ల కోటా వివరాలను ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను జూలై 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
22న ఆర్జిత సేవా టికెట్లు:
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను జూలై 22న ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి.
22న వర్చువల్ సేవల కోటా:
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
23న అంగప్రదక్షిణం టోకెన్లు:
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా:
శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు:
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా :
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా :
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
పైన పేర్కొన్న శ్రీవారి ఆర్జితసేవలతో పాటు శ్రీవారి దర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఇతర వెబ్ సైట్లను నమ్మి... మోసపోవద్దని సూచించింది. ఫేక్ వెబ్ సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.