స్మార్ట్ఫోన్ వినియోగదారులకు షాక్. మార్చి 1 నుంచి మనందరికి కొత్త సవాళ్లు ఎదురుకాబోతున్నాయి! మీరు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లను కంప్యూటర్లలో లేదా వెబ్ వెర్షన్లలో వాడుతున్నారా? అయితే ఈ హెచ్చరిక మీ కోసమే. కేంద్ర టెలికాం శాఖ (DoT) తీసుకువచ్చిన 'సిమ్ బైండింగ్' (SIM Binding) నిబంధనలు రేపటి నుంచే మీ డిజిటల్ అలవాట్లను మార్చేయబోతున్నాయి
ఇప్పటివరకు మనం ఒక్కసారి ఆఫీసులోనో, ఇంట్లోనో కంప్యూటర్ ద్వారా వాట్సాప్ వెబ్ లాగిన్ చేస్తే.. నెలల తరబడి అది అలాగే ఉండేది. కానీ మార్చి 1 నుంచి సీన్ మారిపోతుంది. కొత్త రూల్ ప్రకారం, మీ వెబ్ వెర్షన్ ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అయిపోతుంది. అంటే, మీరు మళ్లీ వాడాలంటే ప్రతి ఆరు గంటలకు ఒకసారి క్యూఆర్ (QR) కోడ్ను స్కాన్ చేసి మళ్లీ లింక్ చేయాల్సిందే. భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా, ఇది సామాన్యులకు పెద్ద తలనొప్పిగా మారనుంది.
సిమ్ కార్డు లేకపోతే యాప్ పనిచేయదు!
ఇకపై మీ కమ్యూనికేషన్ యాప్లు కేవలం మీ ఫోన్ నంబర్తోనే కాదు, ఫోన్లోని సిమ్ కార్డుతో కూడా 'బైండ్' (ముడిపడి) అయి ఉండాలి. అంటే, మీ ఫోన్లో ఆ నిర్దిష్ట సిమ్ కార్డు ఉంటేనే ఆ యాప్ పనిచేస్తుంది. ఒకవేళ మీరు సిమ్ కార్డు తీసేసి కేవలం వైఫై (Wi-Fi) తో వాడదామనుకుంటే కుదరదు. దీనివల్ల దాదాపు 80% మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని 'కట్స్ ఇంటర్నేషనల్' సర్వే వెల్లడించింది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉండి, ఇంట్లో ఒకే ఫోన్ను అందరూ పంచుకునే కుటుంబాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండనుంది.
వ్యాపారాలకు తప్పని తిప్పలు
చిన్న - మధ్య తరహా వ్యాపారాల (SMBs) పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారనుంది. దాదాపు 60% చిన్న వ్యాపారాలు తమ కస్టమర్ ఆర్డర్ల కోసం వెబ్ ఇంటర్ఫేస్లపైనే ఆధారపడతాయి. ప్రతి 6 గంటలకు లాగ్ అవుట్ అవ్వడం వల్ల కస్టమర్లకు ఇచ్చే రిప్లైలు ఆలస్యం కావచ్చు లేదా ఆర్డర్లు మిస్ కావచ్చు. వ్యాపారాల్లో ఒకే ఖాతాను బహుళ సిబ్బంది వాడుతుంటారు, ఇప్పుడు ఆ సౌలభ్యం పోయి నిర్వహణ ఖర్చులు, సమయం వృథా అయ్యే ప్రమాదం ఉంది.
నిబంధనల్లో మార్పు లేదు: కేంద్రం స్పష్టత
ఈ నిబంధనల వల్ల ఇబ్బందులు కలుగుతాయని విమర్శలు వస్తున్నా, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. "దేశ భద్రత కంటే ఏదీ ముఖ్యం కాదు.. సైబర్ నేరాలను అరికట్టాలంటే ఈ కఠిన నిర్ణయాలు తప్పవు" అని ఆయన స్పష్టం చేశారు. మార్చి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో, వినియోగదారులు తమ ప్రైమరీ సిమ్ కార్డును అందుబాటులో ఉంచుకోవడం మరియు పదేపదే లాగిన్ అయ్యే ప్రక్రియకు సిద్ధపడటం మంచిది.
