
గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహా గణపతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి మరింత గ్రాండ్గా ఉత్సవాలు జరుపుతారు. కాగా, ఇవాళ్టి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో పూజలకు ఖైరతాబాద్ భారీ గణపతి సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు 70 ఏళ్లు పూర్తి కావడంతో 70 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఈసారి శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శమివ్వనున్నారు. మొత్తం ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మొదటి పూజ ప్రారంభం కానుంది. ఈ పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. గతంలో గవర్నర్లు తొలి పూజలో పాల్గొనేవారు. కానీ, ఈసారి అందుకు భిన్నంగా నేరుగా సీఎం పాల్గొంటున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి ప్రతిమను చూసేందుకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పోలీసులు, అధికారులు చేశారు.