Indiramma Bheema Scheme : ఒక్క రూపాయి చెల్లించకుండా రూ.5లక్షలు ఉచిత బీమా.. అర్హులు వీరే.. అమల్లోకి ఎప్పటి నుంచంటే?
Indiramma Bheema Scheme : రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఉండే పేద ప్రజల నుంచి పట్టణాల్లోని పేద వర్గాల వరకు ఒకేసారి ఇందిరమ్మ బీమా పథకంను వర్తింపజేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది
- తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
- పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు శుభవార్త
- రూపాయి చెల్లించకుండా వారందరికీ రూ.5లక్షల ఉచిత బీమా
Indiramma Bheema Scheme : పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అన్నివిధాలుగా అండగా నిలిచేందుకు తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోంది. అయితే, జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున మరికొన్ని కొత్త పథకాలను రేవంత్ సర్కార్ ప్రారంభించనుంది. వీటిలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.15కోట్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ నూతన పథకం ద్వారా గరిష్ఠ ఆర్థిక భద్రత చేకూరనుంది. కుటుంబంలో సంపాదించే ముఖ్యవ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా ఈ ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము అండగా నిలుస్తుంది. ఈ పథకంలో నమోదైన ఏ కుటుంబంలోనైనా దురదృష్టవశాత్తు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ప్రాణనష్టం సంభవిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం బీమా రూపంలో అందుతుంది.
సాధారణంగా బీమా పాలసీలకు ప్రతీయేటా వేల రూపాయల్లో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ ఇందిరమ్మ బీమా పథకానికి అయ్యే పూర్తి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఉండే పేద ప్రజల నుంచి పట్టణాల్లోని పేద వర్గాల వరకు ఒకేసారి ఈ స్కీమ్ వర్తింపజేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ పథకంకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ, దరఖాస్తు విధానం క్లెయిమ్ చేసుకునే నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు దాదాపు పూర్తయింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఈ పథకం జూన్ 2వ తేదీ నుంచి పట్టాలెక్కబోతోంది.
రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ఇందిరమ్మ బీమా పథకం కోసం ఏకంగా రూ.4వేల కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ పథకంను రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. నామినీ, ఇన్సూరెన్స్ అర్హత వయస్సు 18 నుంచి 60ఏండ్లలోపు ఉండాలి. జూన్ నెల నుంచి ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేయనున్నారు. ఈ పథకం కింద క్లెయిమ్ చేసుకున్న కేవలం పది రోజుల్లోనే నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలోకి బీమా సొమ్ము జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుండి.
