టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! Center's big shock to TV channels.. New policy on TV ratings!!

టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! Center's big shock to TV channels.. New policy on TV ratings!!

P Madhav Kumar

 ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం "టీవీ రేటింగ్స్ పాలసీ 2026"ను అధికారికంగా ప్రకటించింది. 2014లో అమల్లోకి వచ్చిన పాత మార్గదర్శకాల స్థానంలో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెపెట్టింది. దీని ద్వారా మారుతున్న డిజిటల్ మీడియా పరిసరాలకు అనుగుణంగా వ్యవస్థను ఆధునీకరించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ కొత్త పాలసీ ద్వారా టీవీ రేటింగ్ రంగంలో పోటీని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.


ముఖ్యంగా, కొత్తగా రేటింగ్ ఏజెన్సీలు ప్రారంభించాలనుకునే కంపెనీలకు ఉన్న ఆర్థిక అడ్డంకులను తగ్గించింది. గతంలో రూ.20 కోట్ల నికర విలువ ఉండాలనే నిబంధనను రూ.5 కోట్లకు తగ్గించడం ద్వారా చిన్న, మధ్య తరహా సంస్థలకు కూడా ఈ రంగంలోకి రావడానికి అవకాశం కల్పించింది. దీంతో కొన్ని సంస్థల ఆధిపత్యం తగ్గి, ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. డేటా నాణ్యత, కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు శ్యాంపిల్ సైజును భారీగా పెంచాలని నిర్ణయించారు.

అంతే కాకుండా రేటింగ్ వ్యవస్థపై నమ్మకం పెంచేందుకు ఏజెన్సీల స్వతంత్రతకు పెద్దపీట వేశారు. కొత్త నిబంధనల ప్రకారం, రేటింగ్ ఏజెన్సీల బోర్డ్‌లో కనీసం 50 శాతం మంది సభ్యులు పూర్తిగా స్వతంత్రులు కావాలి. వారు బ్రాడ్‌కాస్టర్లు, ప్రకటనదారులు లేదా అడ్వర్టైజింగ్ సంస్థలతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి. అదనంగా, ప్రయోజనాల సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్) నివారించేందుకు ఏజెన్సీలు కన్సల్టెన్సీ సేవలు అందించకుండా స్పష్టమైన నిషేధం విధించారు.

ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు ఆరు నెలల్లోగా, కొత్త ఏజెన్సీలు 18 నెలల్లోగా తమ మీటర్డ్ హౌస్‌హోల్డ్‌ల సంఖ్యను కనీసం 80,000కి పెంచాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ సంఖ్యను 1,20,000కి విస్తరించే ప్రణాళికను కూడా ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య సమతుల్యత ఉండేలా శ్యాంప్లింగ్ విధానాన్ని రూపొందించనున్నారు. టీవీ మాత్రమే కాకుండా డిజిటల్ యుగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీని రూపొందించారు. కేబుల్, డీటీహెచ్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, కనెక్టెడ్ టీవీలు, స్మార్ట్ డివైస్‌ల ద్వారా కూడా వీక్షణ డేటాను సేకరించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. దీంతో ప్రేక్షకుల అసలు వీక్షణ అలవాట్లపై సమగ్ర అవగాహన లభించనుంది.

పారదర్శకతను పెంచేందుకు రేటింగ్ ఏజెన్సీలు తమ డేటా సేకరణ విధానాలు, నమూనా నిర్మాణం, గణాంక పద్ధతుల వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్లలో వెల్లడించడం తప్పనిసరి చేశారు. అనామక (అనానిమైజ్డ్) డేటాను పరిశోధన కోసం అందుబాటులో ఉంచేలా మార్గదర్శకాలు రూపొందించారు. అదే సమయంలో, వీక్షకుల వ్యక్తిగత సమాచార భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ 'డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023'ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow