కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలోని వేట్లపాలెం పరిధిలో గోదావరి కాలువ సమీపంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్వర్క్స్ పేలుడు పదార్థాల తయారీ యూనిట్లో శనివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఆకస్మికంగా భారీ పేలుడు సంభవించింది.
పేలుడు తీవ్రతకు పరిశ్రమ ప్రాంగణం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఘటనలో 18 మంది సజీవదహనమైనట్లు అనుమానిస్తున్నారు. అగ్నిజ్వాలలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. పేలుడు శబ్దం దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.
శబ్ద ప్రభావంతో సమీప గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాల భవన స్లాబ్లో పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని అంబులెన్స్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.
